చందు మొండేటి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఇండియా అంతా వినిపిస్తోంది. దానికి కారణం కార్తికేయ 2. కృష్ణ తత్వం బోధిస్తూ శ్రీకృష్ణుడే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని భాషల్లో మరీ ముఖ్యంగా హిందీలో కూడా అద్భుతమైన విజయం సాధించింది. కేవలం 50 స్క్రీన్స్ లో విడుదలైన ఆ సినిమా ఇప్పుడు 1000 స్క్రీన్స్ కు పైగానే ఆడుతుంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. కార్తికేయ 2 సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటికి అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈయనకు ఎంతమంది అగ్ర దర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా కార్తికేయ 2 సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్, కేజిఎఫ్, పుష్ప తర్వాత కార్తికేయ 2కే అంత పేరు వచ్చిందని తెలిపారు. తద్వారా చందు మొండేటి కూడా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ సరసన పాన్ ఇండియా దర్శకుల లిస్టులో చేరిపోయారు.



