కరోనా ఎఫెక్ట్తో సినీ పరిశ్రమ కుదేలైంది. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత షూటింగ్స్ను పునః ప్రారంభించడానికి చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి ఇతర సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చలు జరిపారు. కాగా.. జూన్ 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ను కలవబోతున్నామనే విషయాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్న సి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి అందరం ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 9 మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్గారి అపాయింట్మెంట్ దొరికింది. ఈ మీటింగ్కు రావాలంటూ నందమూరి బాలకృష్ణగారికి నేను ఫోన్ చేసి ఆహ్వానించాను. అయితే జూన్ 10న బాలకృష్ణగారి పుట్టినరోజు. ఆయన కాస్త బిజీగా ఉండటం వల్ల రాలేకపోయే అవకాశాలున్నాయి. చిరంజీవిగారు, ఇతర సినీ ప్రముఖులు వై.ఎస్.జగన్గారిని కలుస్తున్నాం’’ అన్నారు.