ప్రముఖ నటులు, నటనా శిక్షకులు అయిన కీర్తి శేషులు దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల దంపతుల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి కనకాల నేడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. నటుడు రాజీవ్ కనకాల సోదరి, మరియు యాంకర్ సుమకు ఆడపడుచు అయిన శ్రీలక్ష్మి కనకాల, మన తెలుగు వారికి పలు సీరియల్స్ ద్వారా సుపరిచితమే. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావుని వివాహమాడిన శ్రీలక్ష్మి కనకాల, కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
ఇటీవల కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం నిన్న రాత్రి మరింతగా విషమించడంతో డాక్టర్లు ఆమెకు అత్యవసర చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని, నేటి మధ్యాహ్నం సమయంలో ఆమె మనందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. రామారావు, శ్రీలక్ష్మి కనకాల దంపతలకు ఇద్దరు కుమార్తె లు ఉన్నారు. కాగా తన సోదరి అకాల మరణంతో తమ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయిందని, అయితే ప్రస్తుతం దేశంలో లాకౌట్ కొనసాగుతున్నందున ఆమె పార్ధివదేహాన్ని చూడడానికి ఎవ్వరూ కూడా రావద్దని, అతి ముఖ్యమైన తమ బంధువుల మధ్యనే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె సోదరుడు రాజీవ్ కనకాల ఒక ప్రకటన విడుదల చేసారు….!!



