కన్నడనాట అత్యంత భారీ ఖర్చుతో 3డి టెక్నాలిజీతో మొదటి పౌరాణిక చిత్రంగా కురక్షేత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నాటి మహాభారత కథను నేటి అత్యద్భుతమైన భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మాస్తున్నారు. తెలుగులో అన్నమయ్య, మంజునాధ, పాండురంగడు వంటి పౌరాణిక చిత్రాలు రచన చేసిన జె.కె భారవి స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం.
వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్న ఈ చిత్రానికి నిర్మాతగా, నాగన్న దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి వి. హరికృష్ణ బాణీలు సమకూర్చారు. కాగా ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని నేడు విడుదల చేసారు. ‘ఈ విశాలమైన కురు మహాసామ్రాజ్యానికి ధర్మరాజును యువరాజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నాను’ అని దివంగత కన్నడ నటుడు అంబరీష్ పలికే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆయన ఈ సినిమాలో భీష్ముడు పాత్రలో కనిపించనున్నారు. దుర్యోధనుడి పాత్రలో దర్శన్, కర్ణుడి పాత్రలో అర్జున్, ధర్మరాజుగా శశి కుమార్, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, కృష్ణుడిగా రవిచంద్రన్ కనిపించనున్నారు.
‘తల ఎత్తుకుని బతికిన వారు తల దించుకుని చూస్తున్నారు’ అంటూ దుర్యోధనుడు పాండవుల్ని అవమానించారు’. ‘ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రం రణక్షేత్రం అవుతుంది. అధర్మం నశిస్తుంది. ధర్మం జయిస్తుంది’ అని కృష్ణుడు చివర్లో భవిష్యత్తు చెప్పే డైలాగులు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్కు ఇది 50వ చిత్రం కావడం కూడా మరో విశేషం. ఈ చిత్రం కన్నడ చిత్రపరిశ్రమ పేరు ప్రఖ్యాతలు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదిగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!


