జాతీయ అవార్డు సాధించిన నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సిరివెన్నెల. ఇటీవల మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా రూపొంది మంచి సక్సెస్ సాధించిన ‘మహానటి’ చిత్రంలో బాల సావిత్రిగా అందరినీ మెప్పించిన సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏఎన్బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిమిస్తుండగా, ప్రకాష్ పులిజాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో మరియు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లోని ఆర్ కె మల్టిప్లెక్స్ లో దిగ్గజ దర్శకులు కె రాఘవేంద్ర రావు, సంగీత దర్శకులు కీరవాణి, ఆర్ పి పట్నాయక్ వంటి ప్రత్యేక అతిథుల సమక్షంలో సినిమా యూనిట్ ఎంతో వేడుకగా నిర్వహించింది.
ఇక ఈ చిత్ర అధికారిక ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. తనకు జరిగిన అన్యాయంపై ఒక చిన్నారి ఆత్మ పగతీర్చుకునే హారర్ కథాంశంతో ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘ఆయువు అల్పం, కానీ ఆగ్రహం అనంతం’ అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ యాక్షన్ మరియు హర్రర్ అంశాలతో సాగింది. ఇక ట్రైలర్ ను బట్టి ప్రియమణి ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ‘నీ అభిలాష ఆత్మలపై అధ్యయనం, నీ అంతర్మధనం ఆత్మలపై పరిశోధన’, ‘అది మాములు ఆత్మ కాదు, రివెంజి ఒక రేంజిలో రగిలిపోతున్న ఆత్మ’ వంటి డైలాగులు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతాయనే చెప్పాలి. బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Click here To Watch Sirivennela Trailer


