72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కి రెండు అవార్డులు దక్కడం గర్వంగా ఉంది – నిర్మాత ఫణి అడపాక
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రం మరియు ఉత్తమ మేకప్ విభాగాల్లో రెండు జాతీయ పురస్కారాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత ఫణి అడపాక అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నిర్మాతగా నా ప్రస్థానం ‘సిద్ధార్థ్ రాయ్’తో మొదలైంది. ఆ సినిమాతో విలువైన అనుభవం వచ్చింది. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో కలిసి ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి మంచి కథ, గట్టి భావోద్వేగాలు ఉన్న సినిమా చేయడం నా అదృష్టం. ఈ రోజు అదే సినిమా 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో గెలుపొందడం అపూర్వమైన ఆనందాన్ని ఇస్తోంది. నిర్మాతగా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మా సినిమాను జాతీయ స్థాయిలో గుర్తించడం మొత్తం టీమ్ కృషికి లభించిన గౌరవం.ఈ విజయంలో భాగమైన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి డిపార్ట్మెంట్లో శ్రద్ధగా పనిచేసిన యూనిట్ అందరికీ అభినందనలు. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రాన్ని సొంత సినిమాలా ప్రేమించి ఆదరించిన ప్రేక్షకులే ఈ అవార్డులకు నిజమైన కారణం. ఈ విజయాన్ని వారికే అంకితమిస్తున్నాం.ప్రస్తుతం ETV Winతో కలిసి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీ కోసం కూడా మంచి, వినూత్న కథలను ప్రేక్షకులకు అందించాలనేదే మా లక్ష్యం. ఈ జాతీయ అవార్డులు మాపై బాధ్యతను మరింత పెంచాయి. ముందు ముందు కూడా మంచి కథలు, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే సినిమాలు, వెబ్ సిరీస్లతో వచ్చి తెలుగు సినిమా పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్తామని” నిర్మాత ఫణి అడపాక పేర్కొన్నారు.




