పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో, ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రం సినిమా లో నటించటం కోసం వచ్చిన మల్లయోధులకు సన్మానం

0
200

గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “ప్రాచీన యుద్ధ విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్ శ్రీ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్పుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందాను.

మీ పిల్లలకూ తర్ఫీదు ఇప్పించండి
బలమైన మస్తిష్కంతో పాటు బలమైన శరీరం ఉండటం చాలా అవసరం. శారీరక దారుఢ్యం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. సగటు భారతీయుడు, ముఖ్యంగా తెలుగువారు గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలను ప్రోత్సహించాలి. జనసేన ప్రభుత్వం వస్తే ప్రాచీన యుద్ధ విద్యలను ప్రోత్సహిస్తాం. జనసేన నాయకులు, జనసైనికులను యుద్ధ విద్యలను ప్రోత్సహించమని కోరుతున్నాను. మీ పిల్లలను కూడా యుద్ధ విద్యలను అభ్యసించడానికి పంపించండి. సమాజం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యాలు ఏలుతారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుంటే అవినీతిపై పోరాటం చేయడానికి శక్తి వస్తుంది. ఒక పద్దతి, క్రమశిక్షణ అలవడుతుంది. నా సినిమా కోసం (దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో, ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రం) ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వీళ్లందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారతదేశంలో బలమైన సమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.

• మల్లయోధులకు సన్మానం
ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని శ్రీ పవన్ కళ్యాణ్  సత్కరించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గదను బహుమతిగా అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here