బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీబాంబ్’. దక్షిణాదిలో తీసిన ‘కాంచన’కు హిందీ రీమేక్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా డిస్నీప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా నవంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్ వీక్షకుల్ని అలరిస్తోంది.
‘దెయ్యాలు, భూతాలనేవి లేవు..’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆరంభమైంది. ‘నిజంగా నేను దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా..’ అని అక్షయ్ కోపంతో అనే డైలాగ్, ఆయన షాపింగ్ మాల్లో ఎరుపు రంగు చీర కట్టుకుని మాట్లాడే తీరు హైలెట్గా నిలిచింది. ‘చెప్పండి.. నేనెలా ఉన్నాను.. బావున్నాను కదా.. నన్ను వదులు.. నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం..’ అంటూ అద్భుతంగా నటించారు. ఇందులో అక్షయ్, కియారాకు వివాహం జరుగుతుంది. దాన్ని బట్టి దర్శకుడు రాఘవ లారెన్స్ ‘కాంచన’ కథలో స్వల్ప మార్పులు చేసి ‘లక్ష్మీబాంబ్’ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.