ఇప్పటికే మూడు నెలలుగా యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు మూడు నెలలకు పైగా మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించడంతో మిగతా ఇతర రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రోజువారీ సినీ కార్మికులకు చేయడానికి పనులు లేక పూట గడవని పరిస్థితులు ఎదురవడంతో ఎందరో సినీ ప్రముఖులు గొప్ప మనసుతో ముందుకు వచ్చి తమకు వీలైనంత సాయాన్ని వారికి అందించగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, తాను సహా పలువురు ఇతర సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి సినీ కార్మికులకు ఇప్పటివరకు నిత్యావసరాలు అందిస్తూ వచ్చారు.
ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అవి పూర్తిగా మొదలుకాకపోవడం, అలానే లాక్ డౌన్ ఇంకా కొనసాగుతుండడంతో, ఈ పరిస్థితులు పూర్తిగా చెక్కబడేవరకు తమ కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా కార్మికులకు నిత్యావసరాలు అందిస్తూనే ఉంటాం అని మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక వీడియో బైట్ లో మాట్లాడుతూ చెప్పారు. అయితే గతంలో మాదిరిగా ఇంటింటికీ కాకుండా, సినీ కార్మికులు ఎవరికి వారు తమ సభ్యత్వ కార్యాలయాలకు వెళ్లి సరుకులను తీసుకోవాలని, అలానే తాను ఒకటికి రెండు సార్లు నాణ్యతను నిశితంగా పరిశీలించిన తరువాతనే అందించడం జరిగిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.



