డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసి అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిన అనుష్క శెట్టి… సినీ ప్రస్థానంలో నేటికి 15 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఆమె ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం కూడా ఏప్రిల్ 2న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ అనుష్క కార్యక్రమంలో….
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నేను తొలిసారి అనుష్కను రామదాసు సమయంలో కలిశాను. అప్పుడే తను సౌతిండియాలో స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను పెద్ద హీరోయిన్గా ఎదిగింది. పూరి తన సూపర్ సినిమాలో అనుష్కను చక్కగా ప్రెజంట్ చేశాడు. కోడి రామకృష్ణగారు, శ్యాంప్రసాద్ రెడ్డి చేసిన అరుంధతితో అనుష్కకి గజకేసరి యోగం పట్టింది. తర్వాత బాహుబలి, రుద్రమదేవి, భాగమతి చిత్రాలతో మెప్పించింది. అలాగే నేను ఓం నమో వేంకటేశాయ చిత్రంలో అనుష్కను డైరెక్ట్ చేశాను. అనుష్కను వెతుక్కుంటూ క్యారెక్టర్స్ వచ్చాయి. ఈ జనరేషన్లో ఏ హీరోయిన్కి దక్కని అదృష్టం అనుష్కకి దక్కింది. ఆమె కెరీర్లోనే బెస్ట్ డైరెక్టర్స్తో పనిచేసింది. తను మంచి హీరోయినే కాదు.. మంచి వ్యక్తి కూడా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. నిశ్శబ్దంలో అనుష్క క్యారెక్టర్ గురించి హేమంత్ నాతో చెప్పాడు. కోనవెంకట్ సహా అందరికీ అభినందనలు’’ అన్నారు.
నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘అనుష్క మంచి స్నేహితురాలు. మన దుఃఖం పంచుకోవడానికి, మన సంతోషంలో పాలు పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తను సాయం చేస్తే బయటకు చెప్పదు. తనకు ఆ దేవుడు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత పీవీపీ మాట్లాడుతూ – ‘‘సమయంల నమ్మశక్యం కానంత వేగంగా పరిగెడుతుంది. 15 సంవత్సరాలు 15 రోజుల్లా గడిచిపోయాయి. నువ్వు నటిగా చాలా మందికి తెలిసినా కూడా.. మంచి స్నేహితురాలిగా కొంత మందికి మాత్రమే తెలుసు. తను చుట్టూ ఉన్న వ్యక్తులను ఆమె గొప్పగా ఆదరిస్తుంది. ఆమె గొప్పగా మరిన్ని చిత్రాలు చేయాలి. ఆమె పదేళ్లు స్టార్గా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘కెరీర్లో నేను అనుష్కతో లక్ష్యం సినిమా చేసే సమయంలో అందరం అప్పుడప్పుడే ఎదుగుతున్నాం. ఆ సమయంలో తను చిన్న కారు కొనాలా? పెద్ద కారు కొనాలా? అని ఆలోచిస్తుండేది. అలాంటి వ్యక్తి ఓ రష్యన్కు కారు కొనిచ్చే స్థాయికి ఎదిగిందంటే అదే పెద్ద ఎచీవ్మెంట్. 15 ఏళ్ల కెరీర్లో ఏ దర్శకుడు, నిర్మాతకు ఎలాంటి సమస్యను క్రియేట్ చేయలేదు. అదే ఆమె గొప్పతనం. ఆమె ఇంకా గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దం సినిమా గురించి చెప్పాలంటే అందరూ నా స్నేహితులే. చాలా ప్యాషనేటెడ్గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా అన్నీ లాంగ్వేజెస్లో సెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ కె.దశరథ్ మాట్లాడుతూ – ‘‘నేను పనిచేసిన హీరోయిన్స్లో స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క. నాగార్జునగారి దగ్గర చంద్ర అనే మేకప్ మేన్ ఉండేవాడు. ఆయనకు ప్రొడ్యూసర్ కావాలని పెద్ద కోరిక ఉండేది. అరుంధతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన్ని మరో సినిమా చేయకుండా అనుష్క ఆయన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చేసింది. తనలాంటి మంచి వ్యక్తులు గొప్ప స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ వీరుపోట్ల మాట్లాడుతూ – ‘‘అనుష్క మంచి వ్యక్తి అని చెబితే బాహుబలి బ్లాక్బస్టర్ అని మనకు మనం చెప్పుకున్నట్లే ఉంటుంది. స్టార్ హీరోయిన్స్లో తనలాంటి డిసిప్లెయిన్ ఎవరికీ ఉండదు. తనతో కలిసి వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నిశ్శబ్దం సినిమా యూనిట్కు అభినందనలు’’ అన్నారు.
డైరెక్టర్ వైవీయస్ చౌదరి మాట్లాడుతూ – ‘‘దేవదాసు సినిమా ఆడిషన్ తర్వాత నేను ముంబై నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు అనుష్కగారిని కలిశాను. విక్రమార్కుడు సినిమాతో బ్రేక్ త్రూ సినిమా అయ్యింది. తర్వాత ఒక్కమగాడు సినిమాలో నటించింది. తర్వాత అరుంధతి, వేదం వంటి సినిమాలు చేసి స్టార్గా ఎదిగారు. సూపర్స్టార్ డమ్ రావాలంటే మంచి పాత్రలు పడాలి. వాటిని చేయాలంటే మంచి ఓపిక ఉండాలి. తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ పాత్రలకు గౌరవం ఇచ్చి ప్రాణం పోశారు. మంచి వ్యక్తి. మనిషిని మనిషిలాగా చూస్తారు. అదే ఆమె గొప్ప లక్షణం. ఇలాంటి ఎచీవ్మెంట్స్ ఆమె ఎన్నింటినో సాధించాలని కోరుకుంటున్నాను.నిశ్శబ్దం టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. హేమంత్ ఈ సినిమాతో బ్లాక్బస్టర్ను సాధిస్తాడు. కోనవెంకట్గారంటే నాకెంతో ఇష్టం. ఈ నిశ్శబ్దం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘సూపర్ సినిమా హీరోయిన్ కోసం ముంబై వెళ్లినప్పుడు స్వీటీని కలిశాను. నేను హోటల్లో వెయిట్ చేస్తున్నప్పుడు తనని కలిశాను. ఫోటో ఇవ్వమంటే తను స్టాంప్ సైజ్ కన్నా చిన్న ఫొటోను ఇచ్చింది. తను సినిమా పక్షి కాదని అర్థమైంది. యాక్టింగ్ వచ్చా? అని అడిగాను. తెలీదు అంది. చెయ్యగలవా? అన్నాను. ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తానో లేదో తెలియదు అంది. డాన్స్ కూడా తెలియదని చెప్పింది. అప్పుడు మా ఆవిడ పైన హోటల్ రూమ్లో ఉంటే ఫోన్ చేసి చెప్పాను. తను కిందకి వచ్చి చూసి అమ్మాయి పొడవుగా బావుందని చెప్పింది. సినిమాలో పెట్టేదామని అంది. నువ్వు ఏం చేస్తున్నావని అంటే నేనొక యోగా టీచర్ని అంది. సరే! నాతో ఆర్నెల్లు హైదరాబాద్కి రమ్మంటే వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లి నాగార్జున గారిని కలిపించా. ఆయన అనుష్కను చూడగానే నాగార్జునగారు అమ్మాయి చాలా బావుందన్నారు. ఆడిషన్ చేద్దామని అంటే అదేం వద్దు సినిమాలో యాక్ట్ చేయించేద్దామని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర తను యాక్టింగ్ నేర్చుకుంది. తన పేరు స్వీటీ అనే పాస్ పోర్టులో ఉండటాన్ని చూసిన నాగార్జునగారు.. మంచి పేరు పెట్టమని అన్నారు. అప్పుడు మిల మిల సాంగ్ పాడటానికి వచ్చిన అమ్మాయి పేరు అడిగితే అనుష్క అని చెప్పింది. ఈ పేరు బావుందే అని నాగార్జునగారికి చెబితే బావుంది. అదే పేరు పెట్టేసెయ్ అన్నారు. అలా స్వీటికీ అనుష్క అనే నామకరణం చేశాం. మంచి తనం, తెలివి తేటలు కలిసిన కాంబినేషన్ తనది. సూపర్తో స్టార్ట్ అయ్యి.. నిశ్శబ్దం వరకు వచ్చింది. తనకు హ్యాట్సాప్. నిశ్శబ్దం సినిమాను ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. అందులో అనుష్క మూగ అమ్మాయి రోల్ చేసింది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ – ‘‘మాస్ సినిమా చేసే సమయంలో నాకు అనుష్కతో పరిచయం ఏర్పడింది. తనకు చాలా సహనమెక్కువ. అమేజింగ్ స్టార్. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో అద్భుతమైన పాత్రలెన్నింటినో చేసింది. నిశ్శబ్దం సినిమా చూశాం. అద్భుతంగా సినిమా పాత్రలో ఒదిగిపోయింది. హేమంత్, అనుష్క, కోన వెంకట్ సహా ఎంటైర్ యూనిట్ కోసం సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత డి.సురేష్బాబు మాట్లాడుతూ – ‘‘సూపర్ సినిమా నుండి అనుష్కని చూస్తున్నాను. మంచి హృదయమున్న హీరోయిన్. తనకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అనుష్కగారితో నిశ్శబ్దం సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కింది. తప్పకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.
నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘కొన్ని సినిమాలు కొందరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి సందర్భం నిశ్శబ్దం సినిమాకు కుదిరింది. ఈ కథను అనుకున్న తర్వాత పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నాం. ఎవరితో చేయాలని అనుకున్నప్పుడు ముంబై విమానాశ్రయంలో అనుష్కను కలిశాను. హైదరాబాద్ రావాల్సిన విమానం అనుకోని పరిస్థితుల్లో చెన్నై రన్నింగ్ వేలో రాత్రి నుండి పొద్దున ఐదు వరకు ఆగిపోయింది. ఆ సమయంలో నేను అనుష్కకి ఈ కథను చెప్పాను. తర్వాత నేను హైదరాబాద్ వచ్చినప్పుడు హేమంత్కు అనుష్క అయితే ఎలా ఉంటుందని చెప్పాను. ఇండియాలో తనే బెస్ట్ ఛాయిస్ సార్ అని చెప్పాడు. అలా తను ఈ సినిమాలోకి వచ్చింది. దేవుడు ఈ సినిమా కోసం కొన్ని పరిస్థితులను క్రియేట్ చేసినట్లుగా అనిపించింది. సాధారణంగా హీరోయిన్స్కు చాలా తక్కువ స్పాన్ ఉంటుంది. కానీ అనుష్క 15 ఏళ్లుగా రాణిస్తుంది. తన మార్క్ని, మార్కెట్ని పెంచుకుంటూ వస్తుంది. తను చేసిన ప్రతి పాత్ర కోసం హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమాలో తను చేసిన పాత్ర కోసం చాలా కష్టపడింది. నాకేమీ తెలియదు అనుకుని స్టూడెంట్లానే కష్టపడుతుంది. అందుకే తను ఇంతకాలం సక్సెస్ఫుల్గా రాణిస్తుంది. తను నిజమైన లేడీ సూపర్స్టార్ అని చెప్పడానికి తను పూర్తిగా అర్హురాలు. తనపైన పుస్తకం రాసేంత గొప్ప లక్షణాలున్నాయి. తను మరో 15 ఏళ్లు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా బాబూరావుగారి అబ్బాయి హేమంత్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ప్లే రైటర్గా నా 55వ సినిమా ఇది. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ప్లే మూవీ ఇది. విశ్వప్రసాద్గారు మాకెంతో సపోర్ట్ను అందించారు. మాకు సపోర్ట్ అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ – ‘‘రెండేళ్లు ఈ సినిమా కోసం అనుష్కగారు మాతో పాటు ట్రావెల్ చేశారు. అనుష్కగారు 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇది కూడా ఆమెకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. అంజలి, మాధవన్గారు, సుబ్బరాజ్గారు అందరూ మంచి పాత్రల్లో నటించారు. విశ్వప్రసాద్గారు మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అందరి సపోర్ట్తో సినిమాను అనుకున్నట్లు పూర్తి చేశాను’’ అన్నారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ – ‘‘సినిమా షూటింగ్ చేసే సమయంలో కంఫర్ట్గా అనిపిస్తుందో లేదో అనుకుంటూ వెళ్లాను. నిజానికి అనుష్క స్వీట్ హార్ట్. తను ఇలాగే మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దం మూవీలో నన్ను భాగం చేసినందుకు థాంక్స్. హేమంత్, కోన వెంకట్గారికి, విశ్వప్రసాద్ గారు సహా అందరికీ అభినందనలు’’ అన్నారు.
ఆల్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ‘‘స్వీీటీ మా ఫ్యామిలీ ఫ్రెండ్. తనలో ఎన్ని మంచి లక్షణాలుంటాయో అందరూ చెప్పేశారు. తను ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటుంది. తనతో విక్రమార్కుడు సినిమా సమయంలో ప్రతి షాట్ను చేసి చూపించమనేది. మామూలు సీన్ అయితే పరావలేదు. కానీ రొమాంటిక్ సీన్ను కూడా నాతో చేయించి చూసుకుని తను నటించింది. అదే సమయంలో మా కుటుంబానికి ఎంతో దగ్గరైంది. నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కానీ దేవసేన పాత్రను క్రియేట్ చేసినందుకు గర్వపడతుంటాను. తను అద్భుతంగా ఆ పాత్రను పోషించింది. వ్యక్తిగా, నటిగా అనుష్క అంటే నాకెంతో గౌరవం. అనుష్క ఎన్నో గొప్ప పాత్రలు చేసింది. మరిన్ని గొప్ప పాత్రలను చేస్తుందని అనుకుంటున్నాను. నిశ్శబ్దం టీజర్, ట్రైలర్ బావున్నాయి. ఏప్రిల్ 2న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి మాట్లాడుతూ – ‘‘ఇది నాకెంతో స్పెషల్. అందరూ నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు అయ్యిందని అంటున్నారు కానీ.. సీనియర్స్ చేసిన ఎచీవ్మెంట్స్తో పోల్చితే ఇది చాలా చిన్నది. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటాను. ఇంకా బెటర్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేయడానికి చూస్తాను. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక డైరెక్టర్కి, నిర్మాతకు థాంక్స్. అందరూ నాకు మంచి ప్రయాణాన్ని అందించారు. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ థాంక్స్. విశ్వప్రసాద్గారికి, కోన వెంకట్గారికి సహా అంజలి, మాధవన్, సుబ్బరాజ్, షాలిని సహా అందరికీ థాంక్స్. మేం ‘నిశ్శబ్దం’లో మా బెస్ట్ను ఇచ్చాం. ఏప్రిల్ 2 న సినిమా వస్తుంది’’ అన్నారు