గత ఏడాది త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో తన నట జీవితానికి కొంత విరామం ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత తన జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయి రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. ఇకపోతే కొద్దిరోజుల నుండి ఆయన తదుపరి నటించబోయే సినిమా విషయమై పలు వార్తలు వైరల్ అవుతుండగా, నేడు దానిపై ఒక సంచలన ప్రకటన రావడం జరిగింది.
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పవన్ నటించబోయే తదుపరి సినిమా విషయమై ఒక ప్రకటన రిలీజ్ చేసారు. ఇటీవల బాలీవుడ్ లో అనిరుద్ధా రాయ్ చౌదరి దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ మరియు తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొంది మంచి సక్సెస్ సాధించిన సోషల్ థ్రిల్లర్ మూవీ ‘పింక్’ అధికారిక రీమేక్ లో పవన్ నటించబోతున్నట్లు తరణ్ తెలిపారు.
ఇక ఈ సినిమాను ఇటీవల బోనీ కపూర్ తమిళ్ లో అజిత్ హీరోగా కలిసి ‘నెర్కొండ పార్వై’ పేరుతో నిర్మించగా, అక్కడ కూడా మంచి హిట్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి బోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, అలానే ఈ సినిమాకు గతంలో దిల్ రాజు గారి బ్యానర్ లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎం సీ ఏ’ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారని తరణ్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది.


