అద్భుతమైన విజువల్స్ ,యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో మెగాస్టార్ ‘సైరా’ టీజర్…!!

0
641

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఆయన కెరీర్ 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా, ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా పలు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ‘చరిత్ర స్మరించుకుంటే ఝాన్సీ లక్ష్మి బాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలున్నాయి…. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు, ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మ్రోగించిన రేనాటి సూర్యుడు’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్, అత్యద్భుతమైన విజువల్స్ తో, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ తో రోమాంచితంగా సాగింది.

ఇక టీజర్ లో ‘సింహం లాంటోడు దొర’, ‘అతడే వాళ్ళ ధైర్యం దొర’ అనే డైలాగ్, అలానే …రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కాని చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ మెగాస్టార్ పలికే పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మొత్తంగా ఈ టీజర్ రిలీజ్ తరువాత సైరా పై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ టీజర్, మంచి వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుదీప్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతి బాబు, హీరోయిన్ తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీని అందించిన ఈ సినిమాకు మాటలను సాయి మాధవ్ బుర్ర, సినిమాటోగ్రఫీని రత్నవేలు, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్టు ట్రైలర్ లో అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here