ప్రస్తుతం సింగర్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన యువ సింగర్ సిద్ శ్రీరామ్. ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అయన పాడిన పాటల్లో చాలా వరకు శ్రోతల మనసు దోచినవే ఉన్నాయి. ఇక ఇటీవల తెలుగులో టాక్సీ వాలా, హుషారు, గీత గోవిందం, 24, 2.0, పడి పడి లేచే మనసు తదితర సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన శ్రీరామ్, మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. అయితే ఇప్పటివరకు సింగర్ గా మాత్రమే కొనసాగిని శ్రీరామ్, అతి త్వరలో సంగీత దర్శకుడిగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
మరికొద్ది రోజుల్లో ప్రముఖ దర్శకులు మరియు నిర్మాతైన మణిరత్నం గారి నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు ధన శేఖరన్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాజేష్ జంటగా రూపొందనున్న ‘వానమ్ కట్టాటమ్’ సినిమా ద్వారా శ్రీరామ్ సంగీత దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. సింగర్ గానే కాక సంగీతం పై మంచి పట్టుకున్న శ్రీరామ్ లోని టాలెంట్ ను మెచ్చి, మణిరత్నం ఈ అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే సిద్ శ్రీరాం, దర్శకుడు ధనతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టడం జరిగిందట. అయితే ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.