ఒకప్పుడు కథలే ప్రధానంగా సినిమాలు నడిచేవి. ఇప్పుడు కూడా కథలకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే చిన్న పాయింట్ను ఆధారంగా తీసుకొని పకడ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమాను ఇప్పుడు నిర్మించడం ట్రెండింగ్ గా ఉంది. స్టార్ హీరోలు కూడా సరైన కథలు లేకపోవడంతో సినిమాలు చేయకుండా సంవత్సరాలు ఎదురుచూస్తున్న రోజులివి. ఆదరబాదరాగా ఏ సినిమాను పట్టాలెక్కించడం లేదు. కొత్త కథలు తెచ్చేవారిని టాలీవుడ్ లో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మంచి కథలతో వస్తే వారికి సరైన పారితోషికం ఇవ్వడంతో పాటు టైటిల్ కూడా వేస్తున్నారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రిలో కొత్త కథలు రాస్తున్న దర్శకులకు మంచి డిమాండ్ ఉంది. వీరు మంచి కథలను అందించి సినిమాలకు ఘనవిజయం సాధించిపెట్టారు.. అయితే పరిశ్రమలోకి కొత్త డైరెక్టర్లు సరికొత్త కథలతో వస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమా తీయానుకున్న కొందరు నిర్మాతలు మంచి కథల కోసం ఎన్ని ఏళ్లయినా ఎదరుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో సినిమా కథలు తెచ్చే వారికి టాలీవుడ్ లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
తాము తెచ్చే ఏ కథ అయినా సినిమా విజయం సాధిస్తే వారికి డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా కొందరు బడా నిర్మాతలు కూడా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించే ఏ సినిమాలోనైనా స్క్రిప్టు బాగుండేటట్లు చూసుకుంటాడు. దానికి కారణం ఆయన ఎప్పుడూ కొత్త కథల కోసం అన్వేషిస్తూనే ఉంటారు. కొత్త కథలను ఎవరు తీసుకొచ్చినా సమయం తీసుకొని వింటారు.. కథలో బలం ఉంటేనే సినిమా నిర్మాణం వరకూ వెళ్తుంటారు. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తుంటారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రచయితలకు ఫుల్ డిమాండ్ ఉంది. మంచి కథలకు అగ్రతాంబూలం దక్కుతోంది. నవతరం దర్శకులు, రచయితలు తెచ్చే కథలతో స్టార్ హీరోలు సైతం సినిమాలను చేసే పరిస్థితి ఉంది. కథ మంచిదైతే హీరోలే నిర్మాతలుగా మారి సినిమా తీస్తున్నారు.. మంచి కథ అయితే వారు ఊహించని విధంగా రచయితలకు రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కొత్త రచయితలు, దర్శకులు తమ మెదళ్లకు పదును పెడుతూ అద్భుతమైన కథలకు టాలీవుడ్ లో ప్రాణం పోస్తున్నారు.


