రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం – జనసేన – తెలుగుదేశం

0
284

రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం

• రెండో రోజూ ఉత్సాహంగా సాగిన జనసేన – తెలుగుదేశం పార్టీల జిల్లా సమన్వయ సమావేశాలు
• ఉమ్మడి ఉద్యమాలకు కార్యాచరణ రెడీ
• ఎవరెన్ని కుట్రలు పన్నినా సంయుక్త స్ఫూర్తిని ఎక్కడా విఘాతం కలగనీయొద్దు
• నాయకులంతా కలిసి కార్యకర్తలను తగిన విధంగా సంసిద్ధం చేయాలి
• సమన్వయ సంరంభంలో వెల్లువెత్తిన ఐక్య గర్జనలు – సంయుక్త తీర్మానాలు

‘జనసేన – తెలుగుదేశం పార్టీల పొత్తు రాజకీయ ప్రయోజనాల కోసమో.. పదవుల పంపకం కోసమో కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, వైసీపీ పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునరుజ్జీవం పోసేందుకు’ అంటూ జనసేన – తెలుగుదేశం పార్టీల నేతలు సంయుక్తంగా నినదించారు. జిల్లాలవారీగా జరుగుతున్న జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశాలు సోమవారం రెండో రోజూ నాలుగు జిల్లాల్లో విజయవంతంగా సాగాయి. రెండో రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరిచయం చేసుకున్నారు. వర్తమాన రాజకీయాలు, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. రెండు పార్టీల కీలక నాయకులు, జిల్లా నేతల ఆధ్వర్యంలో ఈ సమావేశంలో సహృద్భావ వాతావరణంలో సాగాయి. ఆయా జిల్లాల వారీగా ఉన్న స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు. సంయుక్తంగా రెండు పార్టీలు కలిసి చేయాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలు, జిల్లాలవారీగా కీలకమైన సమస్యలు, పోరాటాలపైనా కూడా సంయుక్త సమావేశాల్లో ఇరు పార్టీల నాయకులు సుదీర్ఘ చర్చలు సాగాయి. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని గుర్తిస్తూ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజల కష్టనష్టాల్లో తోడుగా నిలిచి, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలను ఉపయోగించుకొని వైసీపీ చేస్తున్న దాష్టీకాలను రెండు పార్టీల కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటేనే బలమైన సమాధానం చెప్పగలమని అభిప్రాయానికి నేతలు వచ్చారు. రెండు పార్టీల మధ్య సున్నితమైన అంశాల్లో వివాదాలు సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉందని, సోషల్ మీడియాను వాడుకొని లేనిపోని అపోహలు రేపేలా వైసీపీ చూస్తోందని సమావేశాల్లో కొందరు ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే వివాదాస్పద అంశాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత, పార్టీల అధినాయకత్వం సూచనల మేరకు మాత్రమే స్పందించాలని ఈ సందర్భంగా నేతలు తీర్మానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను సమావేశాల్లో చర్చించారు. కీలకమైన సమయంలో సాగునీటి నిర్వహణలో వైసీపీ ప్రభుత్వ విఫలమైందని దీంతో పంటలు ఎండిపోయే దశకు వచ్చాయన్నారు. విపత్కాల సమయంలో రైతాంగానికి అండగా నిలబడాలని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో కరవును ప్రకటించి, అన్నదాతలను ఆదుకునేలా ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు. కరెంటు ఛార్జీల బాదుడు దారుణంగా ఉందని, సామాన్యుడు రాష్ట్రంలో బతకలేని స్థితికి వైసీపీ తీసుకొచ్చిందని మండిపడ్డారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబునాయుడి గారి అక్రమ అరెస్టు విషయాన్ని నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీ చంద్రబాబు గారిపై అక్రమ కేసుల బనాయింపు జరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తన సొంత జాగీరులా రాష్ట్రంలో వ్యవహరిస్తోందని, విపక్షాలు ఏ కార్యక్రమం తలపెట్టిన కక్షపూరితంగా వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకుంటున్నారన్నారు. దేశ అత్యవసర స్థితి రోజులు కంటే రాష్ట్రంలో పరిస్థితులు రాన్రాను దిగజారిపోతున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు.

• ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ భేటీ ఏలూరులో జరిగింది. కార్యక్రమానికి జనసేన పార్టీ పరిశీలకుడిగా పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్, జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయకుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి పరిశీలకుడిగా మాజీ మంత్రి శ్రీ నక్కా ఆనందబాబు హాజరయ్యారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీమతి తోట సీతారామలక్ష్మి, శ్రీ గన్ని వీరాంజనేయులు, శ్రీ కేఎస్ జవహార్ లు నాయకులను సమన్వయం చేసుకున్నారు. పొత్తులో భాగంగా రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు సమన్వయం చేసుకొని, కార్యకర్తలను సమన్వయ పరిచి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బలంగా పోరాడాలని, అక్రమ కేసులు బనాయిస్తే ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించారు. సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు శ్రీ కనకరాజు సూరి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ ఎండీ షరీఫ్, శ్రీ పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మల రామానాయుడు, శ్రీ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

• ఉమ్మడి చిత్తూరు జిల్లాలో…
ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన – తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయ సమావేశం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. జనసేన పార్టీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, టిడిపి నుంచి శ్రీ బీద రవిచంద్రలు పరిశీలకులుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యన్ని రక్షించేందుకు, రాష్ట్రాన్ని కాపాడేందుకు జనసేన – తెలుగుదేశం పార్టీ అధినేతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన పొత్తును ప్రజలు అర్ధం చేసుకున్నారని నాయకులంతా ముక్తకంఠంతో స్వాగతించారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు ఈ కలయిక ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, చిత్తూరులోని కీలక సమస్యలపై సమావేశంలో చర్చ జరిగింది. రెండు పార్టీల పోరాట కార్యాచరణ మీద చర్చించారు. జనసేన పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు శ్రీ పసుపులేటి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి, శ్రీ పులివర్తి నాని ఈ సమావేశాన్ని పర్యవేక్షించారు.

• ఉమ్మడి కృష్ణా జిల్లాలో…
ఉమ్మడి కృష్ణా జిల్లా ఇరు పార్టీల సమన్వయ సమావేశం విజయవాడలో జరిగింది. సమావేశానికి జనసేన పార్టీ పరిశీలకుడిగా పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ చేగొండి సూర్యప్రకాష్, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా మాజీ మంత్రి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. జిల్లాలోని ముఖ్య సమస్యలతో పాటు ప్రస్తుతం సాగునీటి సమస్య తీవ్రం కావడంపైనా సమావేశంలో చర్చించారు. వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని నాయకులు చెప్పారు. రెండు పార్టీల నుంచి హాజరైన కీలక నేతలు ప్రసంగించి, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకు వెళ్తేనే ప్రజలకు మేలు చేసే ఫలితం వస్తుందని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు శ్రీ కొనకళ్ల నారాయణ, శ్రీ నెట్టెం రఘురాంలు సమావేశాన్ని సమన్వయపరిచారు.

• ఉమ్మడి కడప జిల్లాలో…
ఉమ్మడి కడప జిల్లా జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం కడపలో ఉత్సాహంగా జరిగింది. జనసేన పార్టీ పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శి శ్రీ నయుబ్ కమల్, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం సొంత జిల్లాలో జనసేన – తెలుగుదేశం పార్టీల కలయిక వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టించాలని, దీనికి క్షేత్రస్థాయి పని తీరు ముఖ్యమని నేతలు అభిప్రాయపడ్డారు. సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి రెండేళ్లు కావొస్తున్నా… కనీసం ముఖ్యమంత్రి ఇప్పటి వరకు బాధితులకు దారి చూపించలేకపోయారని నేతలు స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. జిల్లాలోని సమస్యలపై భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవాలని తీర్మానించారు. నాయకులు సుహృధ్బావ వాతావరణంలో, రాష్ట్ర ఉన్నతి కోసం పట్టుదలగా పని చేయాలని చెప్పారు. జనసేన పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ సుంకర శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ మల్లెల లింగారెడ్డి ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here