టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీ మామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్స్. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, కో- ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం…
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది?
– వివేక్ ద్వారా జనార్ధన మహర్షి నన్ను కలిసి ఈ కథ చెప్పాడు. ఐడియా నచ్చింది. కానీ ఈ కథపై చాలా పని చేయాల్సి ఉందనిపించి ఏమైనా చేంజెస్ చేయగలవేమో ఒకసారి ఐడియా విను అని కోన వెంకట్ కి చెప్పడం తను పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఐడియా చాలా బావుంది. ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు అన్నాడు. ఎవరైతే బావుంటుందా అనుకుంటూ కళ్యాణ్ కృష్ణ తో మాట్లాడాము కానీ అప్పటికే తను నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా కాంట్రాక్ట్ ఉండడంతో కుదరలేదు. అంతలో వెంకటేష్ మరో స్క్రిప్ట్ నచ్చడం సినిమా చేయడంతో ఈ సినిమా కాస్త లేట్ అయింది.
ఈ కథలోకి దర్శకుడు బాబీ ఎలా ఎంటర్ అయ్యారు?
– బాబీని కోన వెంకట్ సజెస్ట్ చేశాడు. అంతకు ముందు బాబీ ని కలవలేదు.. తను ఐడియా విన్న తరవాత రిజినల్ కథలోలేని ఫస్టాఫ్, సెకండాఫ్ ని కనెక్ట్ చేసే సీక్వెన్స్.. వీడు నా అక్క కొడుకు.. వీడు నా బాధ్యత అని హీరో అనే సీక్వెన్స్ వింటే.. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను బాబీ నే ఈ సినిమా దర్శకుడు అని ఫిక్స్ అయ్యాను. కానీ ఫస్ట్ టైమ్ కాబట్టి ఎక్కువ చెప్పొద్దు అనుకోని బాగుంది అని పంపించేసాను. ఆ తరువాత నాకున్న కొన్ని సందేహాల్ని అడిగాను. బాబీ కూడా సవరణలు చేశాడు. వెంకటేశ్, చైతన్య స్క్రిప్ట్ విన్నారు. తమ పాత్రల పట్ల సంతృప్తి చెందారు. దాంతో చిత్రీకరణ ప్రారంభించాం
‘వెంకీమామ’ ఫస్ట్ కాపీ చూశారు. సినిమా చూశాక మీరు ఎలా ఫీల్ అయ్యారు ?
– వెంకీమామ
చక్కటి కుటుంబకథా చిత్రం. నేను ‘దేవత’ నుంచి నిర్మాణంలో చురుగ్గా ఉంటున్నా, నాన్నగారి దగ్గర నుంచి ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూనే చాలా కథలు విన్నాను. కానీ పాతరోజుల్లో తీసిన మంచి సినిమాలుకంటే ఇప్పటి సినిమాలు గొప్పగా అనిపించవు. ఎన్నిప్రేమ కథ చిత్రాలు వస్తున్నా ‘ప్రేమించుకుందాం..రా’, ‘ఒక్కడు’ కంటే మిన్నగా అనిపించవు. ఎన్ని కుటుంబకథా చిత్రాలు వస్తున్నా ‘కలిసుందాం..రా’ కన్నా బెటర్గా అనిపించవు. అప్పట్లో గొప్ప రచయితలు, హీరోలు అందుబాటులో ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సినిమా తీయడంలో మనకు ఒక విధానం అంటూ లేదు. సినిమాని సమర్థతతో చేయగలిగే నిర్మాతల్ని మనం తయారు చేస్తేనే పరిశ్రమ బాగుంటుంది ఈ వెంకీమామ అందరినీ అలరించే చిత్రం అవుతుందని చెప్పగలను. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు మధ్య జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ టచ్ చేస్తాయి.
‘వెంకీ మామ’ రిలీజ్ విషయంలో మొదటి నుండి చాల విడుదల తేదీలు వినిపించాయి ?
– గతేడాది నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. కొన్ని పనుల వల్ల రెండు నెలల పాటు అమెరికాలోనే ఉండాల్సి వచ్చింది. మొదట దసరాకే విడుదల చేయాలనుకున్నాం. కానీ చివరి షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో వెంకటేష్ కాలు బెణికింది. వెంకీకి ఎన్నిరోజుల్లో నయమవుతుందో తెలియదు. దాంతో దీపావళికి విడుదల చేయాలనుకున్నాం. ఒక పాట చిత్రీకరించాల్సి ఉండగా, రాశీఖన్నా డేట్లు సర్దుబాటు కాలేదు. ఈసారి సినిమా మొత్తం పూర్తి చేశాక క్రిస్మస్ కూడా కలిసొస్తుందని ఈనెల 13న వస్తున్నాం. జనవరిలో రావాలనే ఆలోచనే నాకు లేదు ఎందుకంటే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘దర్బార్’ సినిమాలకు ముందే విడుదల తేదీని ప్రకటించారు. అన్నిచోట్ల అందరికి థియేటర్లు దొరకవు. కొన్ని ఊళ్ళల్లో రెండు, మూడు థియేటర్లే వుంటాయి. అక్కడ అక్కడ కొన్ని సినిమాలు అసలు ఆడవు. అందుకనే మా టీమ్ తో కలిసి కూర్చొని ఈ డేట్ ని ఫిక్స్ చేయడం జరిగింది.
ఈ సినిమా ఇద్దరి అభిమానులకు ఎలా ఉంటుంది?
– వెంకటేష్ చాలా సినిమాలో నటించాడు. తనగురించి నాకేం భయం లేదు కానీ చాలామందిలో వెంకీ ముందు చైతు క్యారెక్టర్ ఏమైనా తగ్గిపోతుందేమో అనే అనుమానం ఉంది. కానీ అస్సలు కాదు. చైతు కెరియర్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. చైతుకి ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది.. యాక్షన్, రొమాన్స్, కామెడీ.. అన్ని రకాలుగా చైతును ఎలివేట్ చేసిన క్యారెక్టర్ ఇది. కచ్చితంగా వెంకటేష్, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుంది.
సినిమా విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో వస్తున్నాయి భవిష్యత్ లో థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది?
-ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండేలా పరిశ్రమ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రేక్షకుడు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తాడు. చాలా ఊళ్లలో ఒకట్రెండు థియేటర్లే ఉంటాయి. అక్కడ రెండు సినిమాల్ని మించి ప్రదర్శించడం లేదు. అలా కాకుండా ప్రతి ఊరినీ ఒక మల్టీప్లెక్స్లాగా మార్చాలి. ఒకొక్క షోలో ఒక్కో సినిమాని ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలి. ఎవరికి నచ్చింది వాళ్లు చూసి ఆస్వాదిస్తారు. అప్పుడు సినిమాలు కూడా ఇదివరకటిలాగా ఎక్కువ రోజులు థియేటర్లలో అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మాధ్యమాల వల్ల పైరసీ తగ్గిందంటున్నారు. కానీ పైరసీ లెక్కలు ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు తాత్కాలికంగా దానిపై దృష్టిపెడుతుంటారంతే..
– మనం హాలీవుడ్ మూవీస్ తీసుకుంటే అత్యున్నత ప్రమాణాలతో థియేటర్లో తప్ప డిజిటల్లో చూస్తే కిక్ రాదనేలా భారీ చిత్రాలు తీస్తున్నారు. అందుకనే వాటికి డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో ఎక్కువ చూడరు. అలా కొత్త నిర్మాతలు ఇప్పుడు క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సివుంది. ఐదేళ్ళ క్రితం టీవీ షోలకు, ఇప్పటికీ చాలా తేడా వుంది. క్వాలిటీలో తేడా కన్పిస్తుంది. చాలా రోజులపాటు చిత్రీకరణ చేయడంతో చాలా వేస్టేజ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. హిందీలో అక్షయ్కుమార్ 35 డేస్లో సినిమా ఒక చేస్తున్నాడు. అయినా క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. దాన్ని బేస్చేసుకుని చాలా మంది మన నిర్మాతలు, హీరోలు మారాలి. ‘ట్రాన్స్ఫార్మర్’ అనే హాలీవుడ్ సినిమాను 8 వారాల్లో తీసేశారు. దానికి ముందు ప్రీప్రొడక్షన్, పక్కా ప్లానింగ్ అవసరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో తప్పనిసరిగా పెద్దదిక్కు కావాలి. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అప్పట్లో దాసరినారాయణరావుగారు వున్నారు. అందుకు అందరూ సమ్మతించారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని అంగీకరిస్తారో తెలీదు. నా మటుకు ఇలాంటి బాధ్యత చేయాలంటే కష్టమే.
తదుపరి చిత్రాల గురించి?
– వెంకటేశ్తో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వి క్రియేషన్స్తో కలిసి ‘అసురన్’ రీమేక్ చేస్తున్నాం. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. అందులో అభిరామ్ నటిస్తున్నాడన్న వార్తలో నిజం లేదు. తక్కువ రోజుల్లో నాణ్యమైన సినిమా తీయాలని ‘హిరణ్యకశ్యప’ ప్రీప్రొడక్షన్ వర్క్స్కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్తో కూడిన ఒక భారతీయ సినిమాని ఎంత బాగా చేయగలమో నిరూపించే ప్రయత్నం అది. వచ్చే ఏడాదిలో చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళతాం. ఇంకా చాలా కథలున్నాయి. కొన్ని సినిమాల రీమేక్ రైట్స్ కొన్నాను. కానీ, సరైన దర్శకుల కోసం చూస్తున్నాను.
నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “వెంకీమామ’ లాంటి కొన్ని సినిమాలు భాగస్వామ్యంతో చేస్తున్నాం అలాగే కొన్ని సినిమాలు సొంతంగా చేస్తున్నాం. రెండేళ్ల కిందటే మా ప్రయాణం మొదలైంది. 7 సినిమాల్ని విడుదల చేశాం. 20 సినిమాల్లో పెట్టుబడులు పెట్టాం. ‘వెంకీమామ’ కోసం చేసిన ఈ ప్రయాణంలో సినిమా నిర్మాణం విషయంలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడింది. నిర్మాత అంటే పెట్టుబడి పెట్టడమే అనుకుంటారు చాలామంది. ఆ సినిమాని ఎంత సమర్థవంతంగా తీస్తున్నాం, కథకి ఎంత విలువ జోడిస్తున్నామనేది ముఖ్యం. హాలీవుడ్ విలువలతో మేం ‘నిశ్శబ్దం’ సినిమాని నిర్మించాం. సినిమాలతో పాటు నేను అమెరికాలో ఐటీ వ్యాపారం చూసుకుంటున్నా. మా నిర్మాణ సంస్థ వ్యవహారాల్ని వివేక్ కూచిభొట్ల చూసుకుంటున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే సురేష్బాబుగారి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నా. నిర్మాతగా ఎలా వుండాలి. ఎలా మార్కెట్ చేయాలనేది గ్రహించాను. తక్కువ ఖర్చు తో ఎక్కువ క్వాలిటీ సినిమాలు ఎలా తీయాలి అనేది సురేష్బాబుగారి నుండి నేర్చుకోవడం జరిగింది.