‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటాబిర్లామధ్యలోలైలా’, ‘యమగోలమళ్లీమొదలైంది ‘, బొమ్మనాబ్రదర్స్, చందన సిస్టర్స్’, ‘డమరుకం’ లాంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బేనర్పై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాగల 24 గంటల్లో..?’. సత్యదేవ్, ఈశారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 22న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్గా విడుదల కాబోతున్న సందర్భంగా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూ..
రాగల 24 గంటల్లో సినిమా గురించి?
– ‘రాగల 24 గంటల్లో’ నేను డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ థ్రిల్లర్ సబ్జెక్ట్. స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇది ఒక గ్రిప్పింగ్ స్క్రిప్ట్. సినిమా మొదలైన ఐదు నిమిషాలనుండి ఆడియన్స్ని అరెస్ట్ చేసే గ్రిప్పింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఉంటుంది. ఎండింగ్ వరకూ నెక్స్ట్ ఏంజరగబోతుంది? అనే సస్పెన్స్ కొనసాగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మాతో పాటు కొంతమంది మా మిత్రులు సినిమా చూశారు. ప్రతి ఒక్కరూ 100 పర్సెంట్ శాటిస్ఫై అయ్యారు. దాంతో నేను మా టీమ్ రిలీజ్ కి ముందే గ్యారెంటీగా హిట్కొట్టాం అనే ధైర్యంతో ఉన్నాం.
మీరు కామెడీ చిత్రాలు ఎక్కువగా చేశారు కదా! ఈ జోనర్ ఎందుకు ఎంచుకున్నారు?
– ఇదొక మర్డర్ మిస్టరీ. నా నెక్స్ట్ మూవీ కూడా నా స్టైల్లోనే తీద్దాం అనుకోని కృష్ణ భగవాన్ రైటర్గా రెండు స్క్రిప్ట్స్ రెడీ చేశాం. అయితే శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి ఈ కథనుకృష్ణ భగవాన్కి వినిపించారు. ఆయన నాకు చెప్పారు బాగా నచ్చడంతో వెంటనే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేశాం. దానికి కారణం స్క్రిప్ట్లో ఉన్న బలం, కొత్తదనమే. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. ‘ఖైదీ’, ‘ఎవరు’ లాంటి చిత్రాల సక్సెస్ దానికి ఉదాహరణ. ఈ స్క్రిప్ట్ కూడా ట్రెండీగా ఉండడంతో మా ప్రొడ్యూసర్స్తో కలిసి సినిమా చేయడం జరిగింది.
రాగల 24 గంటల్లో టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
– ‘రాగల 24 గంటల్లో’ అనేది టీవీ, రేడియోలలో వెదర్ న్యూస్కి ఉపయోగించే పదం. అయితే ఈ సినిమా విపరీతమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో స్టార్ట్ అవుతుంది. అంతలో ఒక మర్డర్కి సంబందించిన బ్రేకింగ్ న్యూస్ టీవిలో వస్తుంది. అలా స్టార్ట్ అయిన ఈ సినిమా 24 గంటల్లో ముగుస్తుంది. ఒక్క రోజులోనే జరిగే కథ కావడం, వెదర్తో కూడా సంబంధం ఉండడంతో ఈ టైటిల్ యాప్ట్గా అనిపించి ఫైనలైజ్ చేశాం.
సత్యదేవ్,ఈషా రెబ్బ పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది?
– ఈ సినిమా మొత్తం ఏడు ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందులో మేము అనుకున్న విధంగా ప్రతి పాత్రకి యాప్ట్ ఆర్టిస్టులు దొరికారు. హీరోయిన్ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె చుట్టూనే ఈ కథ తిరుగుతుంది .మంచి నటి కావాలి అని మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బని హీరోయిన్గా సెలెక్ట్ చేశాం. ఆమె కూడా చాలా బాగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె కూడా నయనతార లాంటి పెర్ఫార్మర్ అంటారు. అలాగే సత్యదేవ్ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో తన నట విశ్వరూపం చూపించాడు. అలాగే చాలా రోజుల తర్వాత శ్రీరామ్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. అలాగే గణేష్ వెంకట్ రామన్, రవి ప్రకాష్, రవి వర్మ, కృష్ణ భగవాన్ ఇలా ప్రతి ఒక్కరూ గొప్పగా నటించారు.
కామిడీకి మీకు మంచి పేరు ఉంది కదా! ఈ సినిమాలో కామిడీ గురించి?
– ఈ సినిమాకి స్క్రిప్టే ప్రధాన బలం. నేను కామెడీ సినిమాలు చేశాను అది నా బలం అని ఎక్కడా కామెడీని చొచ్చించాలనే ప్రయత్నం చేయలేదు. అనవసరమైన సీన్లు లేకుండా రెండు గంటలు గ్రిప్పింగ్గా ఉండే విధంగానే సినిమాను తెరకెక్కించాం. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకూ ఉత్కంఠభరితంగా ఉండే మంచి సినిమా.
సస్పెన్స్ థిల్లర్ సినిమాలో క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ పెట్టాలనే ఆలోచన..
– అది సినిమాలో సిట్యువేషన్కి తగ్గట్లుగా భార్య భర్తలు పాడుకునే మెలోడీ సాంగ్. రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఉండాలని నారాయణే నమోస్తుతే..అని కంపోజ్ చేయడం జరిగింది. ఆపాటను శ్రీమణి గారు రాశారు. ఆ పాట విడుదలైనప్పటి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఆపాట తర్వాత ఎస్.వి.బి. ఛానెల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి రావడం నాఅదృష్టంగా భావిస్తున్నాను.
ఇది కంప్లిట్గా మీకు కొత్త జోనర్ కదా ఏమైనా రిస్క్ అనిపించిందా?
– లేదండి! డైరెక్టర్ అనే వాడు ఎలాంటి జోనర్ అయినా డీల్ చేయగలగాలి. అదే నాకు ఇష్టం కూడా. మీరు ‘అదిరిందయ్యా చంద్రం’ తీసుకుంటే అది బాపు గారి స్టైల్లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్. బొమ్మనాబ్రదర్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ‘యమగోల, డమరుకం’ సోషియోఫాంటసీ జోనర్. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సినిమాలే చేస్తూ వచ్చాను. అందుకే ఈ జోనర్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. కోడి రామకృష్ణ గారు. ఇ.వి.వి గారు అన్ని జోనర్ సినిమాలు టచ్ చేశారు, అన్నింటిలో సక్సెస్ అయ్యారు. ఇది కూడా నా కెరీర్లో ఒక బెస్ట్ మూవీ అవుతుంది.
రఘుకుంచెని మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి?
– రఘుకుంచె గతంలో కొన్ని సినిమాలకి సంగీతం చేశారు. ఆయన సంగీతం నచ్చే ఈ సినిమాకు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజైన రోజే అతడికి ఐదు ఆరు సినిమాలకు ఆఫర్స్ వస్తాయి. అంత బాగా మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్, ఆర్.ఆర్ ఈ సినిమాకు మంచి అసెట్. సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. రెండు చాలా బాగా వచ్చాయి. అలాగే ప్రమోషనల్ సాంగ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
టెక్నీషియన్స్ గురించి?
– ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గరుడవేగ అంజి. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. అలాగే ఏ ఎమోషన్ మిస్ కాకూడదు అని సినిమా మొత్తం రెండు కెమెరాస్తో షూట్ చేయడం జరిగింది. నా కోరిక మేరకు తమ్మిరాజు గారు చాలా ఇన్వాల్వ్ మెంట్తో సినిమా మొత్తం క్రిస్పీగా ఉండేలా ఎడిటింగ్ చేశారు. ఈ మధ్య కాలంలో ‘రాక్షసన్’ చిత్రంతో తమిళంలో ట్రెండ్ సెట్టర్ అయిన ఫైట్ మాస్టర్ని ఈ సినిమా కోసం తీసుకోవడం జరిగింది. నాలుగు ఫైట్స్ ఉంటాయి. నాలుగు ఫైట్స్ని నాలుగు రకాలుగా కొత్తగా డిజైన్ చేశారు. అలాగే కృష్ణ భగవాన్ ఈ సినిమా ద్వారా డైలాగ్ రైటర్గా పరిచయం అవుతున్నారు. ఆయనకు కూడా ఈ చిత్రంతో మరిన్ని ఆఫర్స్ వస్తాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ గురించి?
– ఈ సినిమాకు మా ప్రొడ్యూసర్ కానూరు శ్రీనివాస్ రావు గారే హీరో. ఆయన ఫ్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన గురించి కృతజ్ఞతా పూర్వకంగా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే సక్సెస్ చుట్టే ఏదయినా తిరుగుతుంది. అయితే నేను కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైమ్లో నా దగ్గరకి వచ్చి నాతో సినిమా చేస్తున్న నిర్మాత మా శ్రీనివాస్ రావు గారు. ఆయనే నన్ను ముందుకు నడిపించాడు, ఏ విషయంలోను కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ సినిమా చేశారు. అందుకే మా ప్రొడ్యూసర్ గారే నా హీరో. ఈ సినిమా తర్వాత కూడా ఈ బేనర్లోనే రెండు సినిమాలు చేస్తున్నాను.
బిజినెస్ ఎలా జరిగింది?
– మా సినిమాకు అన్ని ఏరియాల్లో నుండి మంచి ఆఫర్స్ వచ్చాయి, అయితే నాకు, మా ప్రొడ్యూసర్కి సినిమా మీద నమ్మకం ఉండడంతో సురేష్ ప్రొడక్షన్ వారికి సినిమా చూపించాం. సురేష్ బాబు గారికి, జగదీష్ గారికి సినిమా విపరీతంగా నచ్చడంతో వారి బేనర్తో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలను, మంచి సినిమాలను ఆదరించే సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజవ్వడం హ్యాపీగా ఉంది. అంటూ ఇంటర్య్వూ ముగించారు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.