సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇటీవల కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమా సక్సెస్ తో మంచి జోష్ తో ఉన్నారు. ఇక అదే ఊపుతో ఆయన నటిస్తున్న తాజా సినిమా ప్రతిరోజు పండగే షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యువ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది.
ఇకపోతే రేపు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా, ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమోని రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని తెల్పుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని మంచి ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేసి దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్ల పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, యువ సంగీత తరంగం ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!