మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి. క్రియేషన్స్ బేనర్పై రాయ్లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. రామ్కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా, మధునందన్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 15 గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎం. శ్రీధర్ రెడ్డితో ఇంటర్వ్యూ.
మీ నేపథ్యం గురించి?
– నా పేరు శ్రీధర్ రెడ్డి. మాది అనంతపురం. బిటెక్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేశాను. తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సినిమాల మీద ఇంట్రెస్ట్తో కొద్దికాలం సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాను.
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది?
– నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుండి ప్రొడక్షన్ రంగం పట్ల ఆసక్తి ఉంది. సినిమా ఇండస్ట్రీకి రావాలని 2003లో దిల్ రాజు ‘దిల్’ సినిమా తీసినప్పుడే అనుకున్నాను. తర్వాత ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ చిత్రాలు సూపర్హిట్ అవ్వడంతో దిల్ రాజుగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ చిత్రంతో నిర్మాతనయ్యాను.
దిల్ రాజు కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తారు? మీ కెరీర్ని హారర్ సినిమాతో ప్రారంభించారు ఎందుకు?
– ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా పూర్తిస్థాయి హారర్ సినిమా కాదు. రెండుగంటల సేపు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కామెడీకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాను.
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ కాన్సెప్ట్ ఏంటి?
– సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. వెంకటలక్ష్మీ అనే స్కూల్ టీచర్ క్యారెక్టర్ చుట్టూ సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ, హారర్తో పాటు యూత్కి కావాల్సిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటూనే చివరిలో సస్పెన్స్కి గురి చేస్తుంది.
కిషోర్ కుమార్ ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు?
– రచయిత తటవర్తి కిరణ్ ఈ స్టోరి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత ఆయన సహకారంతోనే దర్శకుడు కిషోర్ కుమార్ను కలవడం జరిగింది. మా ఇద్దరికి ఇది మొదటి సినిమా అయినా ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయడం జరిగింది. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం.
రాయ్లక్ష్మీని మెయిన్ లీడ్ తీసుకోవడానికి రీజన్?
– ఈ సినిమా కథా పరంగా ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం చాలామందిని అనుకున్నాం. కానీ ఆ క్యారెక్టర్కి రాయ్లక్ష్మీ అయితే పూర్తి న్యాయం చెయ్యగలరు అని ఆమెను తీసుకున్నాం. ఈ సినిమా ద్వారా రాయ్లక్ష్మీకి మంచి పేరు వస్తుంది.
ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డిల గురించి చెప్పండి?
– ఆనంద్ రెడ్డిగారు మా కజిన్. ప్రముఖ పారిశ్రామిక వేత్త. ‘అనంత బయో టెక్నాలజీస్’ (ఎ.బి.టి) ద్వారా టిష్యూ కల్చర్ని ప్రోత్సహించి, వ్యవసాయ రంగానికి కావాల్సిన పనిముట్లు తయారు చేసే సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. వ్యాపార రంగంలో స్థిరపడిన ఆయన సినిమా రంగంలో మంచి సినిమాలు తీయాలనే సంకల్పంతో నిర్మాతగా మారారు.
నిర్మాతగా ప్రాబ్లెమ్స్ని ఏమైనా ఎదుర్కొన్నారా?
– నిర్మాణ రంగం నాకు కొత్త కాబట్టి ఒక నూతన నిర్మాత ఎదుర్కొనే సమస్యలన్నీ ఎదుర్కోవడం జరిగింది. అయినా నాకు సినిమాల పట్ల ఉన్న ఫ్యాషన్తో కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇష్టంతో, ఓపికతో టెక్నీషియన్స్ దగ్గర నుండి ఎలాంటి ఔట్పుట్ రాబట్టుకోవాలో తెలుసుకుని పూర్తిస్థాయి కమర్షియల్ మూవీగా తెరకెక్కించాం.
బిజినెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
– మేం అనుకున్న స్థాయిలో బిజినెస్ జరిగింది. మార్చి 15న గ్రాండ్గా అత్యథిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.
రాయ్లక్ష్మీ ఎవరి ఛాయిస్?
– ఈ క్యారెక్టర్ కోసం రాయ్లక్ష్మీగారిని తీసుకోవడం నా ఛాయిసే. స్టోరి ఎంత బాగున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ కోసం ఒక క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్ అవసరం ఉంటుంది. ఆమెకు తెలుగులో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్కి ఆడియన్స్ థ్రిల్ అవుతారు.
తమిళ్లో రిలీజ్ చేస్తున్నారా?
– రాయ్లక్ష్మీకి తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెల్సిందే. అందుకే తెలుగు, తమిళ్తో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ చేస్తున్నాం.
రైటర్ కిరణ్ గురించి చెప్పండి?
– కిరణ్గారు పూరి జగన్నాథ్గారి వద్ద ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’కి కూడా వర్క్ చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఫస్ట్టైమ్ ఈ సినిమాకి పూర్తిస్థాయి కథను అందించారు. కథకి తగ్గట్లుగా మా దర్శకుడు కిషోర్ కుమార్ సినిమాని అత్యద్భుతంగా మలిచారు. అలాగే హరిగౌర సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్?
– ప్రస్తుతం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమాపైనే పూర్తి దృష్టి సారించాను. ఇకపై పూర్తిస్థాయి నిర్మాతగా వ్యవహరిస్తాను. రెండు, మూడు సబ్జెక్ట్లు ఉన్నాయి. వాటి గురించి త్వరలో ఎనౌన్స్ చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి.