శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల సేవలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
* ప్రధాని వెంట శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన సేవలో పాల్గొన్న శ్రీ మోదీ గారు
* శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రం పరిశీలన
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం శ్రీశైలం పర్యటనకు విచ్చేశారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. మొదటిగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని శ్రీ మోదీ గారు అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు. ఆలయ వేద పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య శ్రీ మోదీ గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను అలాగే చిత్రపటాన్ని శ్రీ మోడీ గారికి ఆలయ అధికారులు అందించారు. శ్రీ మోదీ గారికి గౌరవపూర్వకంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని శ్రీ మోదీ గారికి ప్రదానం చేశారు. ప్రధానమంత్రి గారికి ఆలయ విశేషాలను అధికారులు తెలియచేశారు. సుమారు గంట సేపు ప్రధాని ఆలయంలో గడిపారు.

శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ
శ్రీశైలంలోనే ఉన్న ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని శ్రీశైలం పర్యటనలో ప్రధాని శ్రీ మోదీ గారు, శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా శ్రీ మోదీ గారు పరిశీలించారు. కేంద్రంలో ఉన్న అతి పెద్ద శివాజీ చిత్రానికి శ్రీ మోదీ గారు నమస్కరించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలను సమర్పించి నమస్కరించారు. కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.



