ప్రభాస్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు : ప్రముఖ నటుడు కృష్ణం రాజు… నటుడిగా ప్రభాస్ ప్రస్థానానికి 20 ఏళ్ళు !

0
181

డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.. కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ పై అయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయనా ఊహించలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ సొంత టాలెంట్ పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాను అటు హాలీవుడ్ లోకూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా..

రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ ..  ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం . ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్ గా నటించాడంటే అయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈశ్వర్ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ .. నిజంగా నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు . ప్రభాస్ నిజంగా గొప్ప వ్యక్తి . ఈ మధ్య కూడా తనను కలిసాను, ఈశ్వర్ సమయంలో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అంత పెద్ద హీరో అన్న గర్వం ఏ కోశానా లేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి. ఇక ఈశ్వర్ సమయంలో ప్రభాస్ తో ఉన్న రోజులు కూడా మరచిపోలేము. ఈ సినిమా సమయంలో కథ అనుకున్న తరువాత చాలా మంది హీరోలను పరిశీలించాను, అయితే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణం రాజునూ కలవడం అయన మేమె పరిచయం చేస్తామని కాకుండా మమ్మల్ని నమ్మి హీరోని ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మాకు సపోర్ట్ అందించిన కృష్ణం రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

ఈశ్వర్ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ఈశ్వర్ సినిమా కథ అనుకున్నాకా నిజానికి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నాను. కానీ అపుడు మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు.. అప్పుడే సినిమాల్లోకి లాగడం కరెక్ట్ కాదేమో అనిపించి మరో హీరో కోసం చూసాం.. చాలా మందిని పరిశీలించాకా ప్రభాస్ నచ్చడంతో వెంటనే కృష్ణం రాజు గారిని కలవడం అయన కూడా ఓకే అనడంతో ఈశ్వర్ తెరకెక్కింది. నిజంగా ప్రభాస్ అప్పటికి ఇప్పటికి అతని యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా కూడా అందరితో కలివిడిగా ఉంటారు. ఈశ్వర్ సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుందా అని అనిపించింది. మొన్నే తీసినట్టుగా ఉంది. సినిమా సినిమాతో ఎదిగిన మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

కృష్ణం రాజు భార్య శ్యామల మాట్లాడుతూ .. ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి నేటికీ 20 ఏళ్ళు అయిందంటే నమ్మకం కలగడం లేదు.. మొన్ననే అయినట్టు ఉంది. ప్రభాస్ ని హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిసి రామానాయుడు స్టూడియో నుండి హైదరాబాద్ రోడ్లన్నీ నిండిపోయాయి. మేము స్టూడియోకి రావాలని కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని వెనక్కి వెళ్లిపోయాం. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని, ఈ విషయం తనతో చెబితే అవును అంటాడు. హీరోగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా అందరితో చాలా చక్కగా ఉంటాడు. నిజంగా ప్రభాస్ ని చూస్తుంటే పెద్దమ్మ గా చాలా గర్వాంగా ఉంది. ప్రభాస్ ఇలాగే మరిన్ని విజయాలు అందుకుంటూ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఆలిండియా రెబల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) మాట్లాడుతూ.. నేను మొదటి నుండి కూడా మా రెబెల్ స్టార్ అభిమానులుగానే ఉన్నాం. ఉంటాం కూడా. మాకు ఆయనే దేవుడు. ఇక ప్రభాస్ హీరోగా పరిచయం అయి నేటికీ ఇరవై ఏళ్ళు పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇరవై  ఏళ్లలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలనీ వైజాగ్ లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇప్పించారు. అప్పుడు ప్రభాస్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో తెలుసుకోమని సూర్య నారాయణ రాజు గారు నన్ను వైజాగ్ ఇనిస్టిట్యూట్ కి పంపించారు. నాపై అంత నమ్మకం ఉంది వాళ్లకు. ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా అయన కు మా అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అయితే ఈ కోవిడ్ సమస్య వల్ల ఈ వేడుకను చాలా మంది అభిమానుల సమక్షంలో జరపాలని అనుకున్నాం కానీ కుదరలేదు అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here