‘విరాటపర్వం’ అద్భుతంగా వుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది: సరళ సోదరుడు తూము మోహన్ రావు

0
223

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిప‌ల్లవి జంట‌ గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని  అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య  తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది విరాటపర్వం. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్చమైన ప్రేమకథ. ఈ ప్రేమ కథలో గొప్ప రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వున్నాయి. రెగ్యులర్ సినిమాలా కాకుండా ప్రత్యేకంగా అనిపిస్తాయి. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం  గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే ‘ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని’ చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే వుంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్” అని తెలిపారు

సాయి పల్లవి మాట్లాడుతూ.. మోహన్ రావు గారికి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు.  సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు గారు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా వుంది. సురేష్ బాబు గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని,చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతీ సారి కొత్త అనుభూతిని పొందుతారు” అన్నారు.

దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా గారు, సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ గారు, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. సాయి పల్లవి గారు లేకపోతే ఈ కథ వుండేది కాదు. ఆమె కు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్గా మరో స్థాయికి తీసుకెళ్ళారు. 1990 వాతావరణంను క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణి కి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా వుంది. విరాట పర్వం ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారా నే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్ధవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి” అన్నారు.

తూము మోహన్ రావు మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఉడుగుల గారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి గారి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. నా భార్య ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా వుంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్ లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా గారు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన  రానాగారికి కృతజ్ఞతలు. సురేష్ బాబు గారు మాఅందరికీ ఒక పెద్ద దిక్కులా వున్నారు.  నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్,  దర్శకుడు వేణు ఉడుగుల గారికి థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని కొరుకున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది.  ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here