డా. టి. సుబ్బరామిరెడ్డి లలితా కళా పరిషత్ ఆధ్వర్యం లో సుప్రసిద్ధ కథానాయిక ‘జమున కు ‘నవరస కళావాణి’ బిరుదు

0
356

అలనాటి సినీతార జమునకు ‘నవరస కళావాణి’ బిరుదును ప్రధానం చేస్తూ డా. టి. సుబ్బరామిరెడ్డి లలితా కళా పరిషత్ స్వర్ణ కంకణం తో సత్కరించింది. రాజ్య సభ సభ్యుడు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం లో ‘సర్వ ధర్మ సమభావన సమ్మేళనం’ కార్యక్రమం నిర్వ హించారు. ప్రముఖ సినీ తారలు బి.సరోజాదేవి,వాణిశ్రీ, ప్రభ, శారద,రాజశ్రీ, కాంచన, గీతాంజలి, జయచిత్ర,జయసుధ,జయప్రద, పరుచూరి బ్రదర్స్ గాయనీమణులు జిక్కి, సుశీల జమునను సత్కరించి ఆమె తో తమ కున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ..’ తన వయసు 82 సంవత్సరాలని, 1978 లో హైదరాబాద్ లోని నిజాం కళాశాల లో జరిగిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో చూశానని మళ్ళీ ఇన్నాళ్లకు ఈ వేదిక పై వారందరిని చూడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు సత్యభామ పాత్ర అంటే ఎంతో పిచ్చి అని గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ పాత్ర వేయగా వచ్చిన మొత్తాన్ని పేదకళాకారులకు ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..’ సుబ్బరామిరెడ్డిని చూసి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. పార్టీలు,కులమతాల కు అతీతంగా ఉండే వ్యక్తి అని కొనియాడారు.

నటి బి. సరోజాదేవి మాట్లాడుతూ..’ జమున తనకు 50 ఏళ్లుగా మంచి స్నేహితురాలని, తనతో కలసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.

నటి జయసుధ మాట్లాడుతూ..’ 12 ఏళ్ళ వయసులో జమునకు కూతురుగా నటించానని, ఇప్పుడు 45 ఏళ్ళ పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

విశాఖలో స్థూడియో నిర్మిస్తా :

ఈ సందర్భంగా డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ..’ విశాఖ నగరానికి కూడా సినీ పరిశ్రమను తీసుకు రావటానికి తనవంతు కృషిని చేస్తానని ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇక్కడ తానో స్థూడియోను నిర్మిస్తానని అన్నారు. విశాఖకు కూడా సినీ పరిశ్రమను తరలించాలని మాజీ రాజ్య సభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కోరగా డా. టి. సుబ్బరామిరెడ్డి పై విధంగా స్పందించారు.

శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ తో పాటు, ముస్లిం,క్రైస్తవ,సిక్కు మత గురువులు ప్రార్ధనలు చేశారు. రాజకీయ నాయకులు కె.వి.పి.రామచంద్ర రావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు లతో పాటు పలువురు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here