ముకుంద, కంచె, లోఫర్ వంటి డిఫరెంట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ డిఫరెంట్ ఇమేజ్ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ తాజాగా ‘మిస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్తేజ్తో ఇంటర్వ్యూ…
‘మిస్టర్’ జర్నీ ఎలా వుంది?
– ఈ సినిమా కోసం ఎక్కువ ట్రావెల్ చేశాం. హైదరాబాద్కు దూరంగా ఉండే లోకేషన్స్, చిక్మంగళూర్, కేరళ, స్పెయిన్ ఇలా అన్నీ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇటలీలో ఒక సాంగ్, స్విజ్జర్లాండ్లో ఓ సాంగ్ చేశాం. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా పూర్తి చేశాం. నిజంగా నాకు ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
– అందరికీ ప్రేమను పంచే క్యారెక్టర్. లవ్ ఫీలింగ్, వెరీ గివింగ్ పర్సన్. ప్రేమ పంచడమే కాదు, ఎవరికైనా సహాయం కావాలన్నా ముందుంటాడు. అలాంటి వాడికి సమస్యలు వస్తే, వాడి లవ్ను వెతుక్కొవడానికి ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాలో మెయిన్ ట్రయాంగిల్ స్టోరీ అయినా నాతో పాటు హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ ఇద్దరికీ ఓ బ్యాక్స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లైవ్లీగా ఉండాలన్న ఉద్దేశంతో సెటిల్డ్గా కాకుండా మూమెంట్తో క్యారెక్టర్ ఉండేలా శ్రీనువైట్లగారు కేర్ తీసుకున్నారు. డైలాగ్ డెలివరీ విషయానికి వచ్చేసరికి శ్రీనుగారికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు నాకు కొత్తగా అనిపించాయి.
ఫస్ట్ టైమ్ శ్రీను వైట్లతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
– శ్రీనువైట్లగారు క్యూట్ మెచ్యూర్డ్ లవ్స్టోరీస్ బాగా చేస్తారని ఎప్పటి నుండో ఆయనకు మంచి పేరుంది. ఆయన బిగినింగ్లో ‘ఆనందం’, ‘నీకోసం’ వంటి సినిమాలను చేశారు. స్టార్హీరోస్తో సినిమాలు చేస్తున్నప్పుడు, కమర్షియల్గా సినిమాలు చేస్తున్నప్పుడు అవి సక్సెస్ కావడంతో అందరూ ఆయన్ను అలాంటి సినిమాలే అడిగారు. ప్రతి ఒక్కరి జర్నీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్గా ఉంటాయి. రీసెంట్గా మంచి విజయం లేనంత మాత్రాన ఆయన చేయలేరని కాదు. అందుకే ఆయన దాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాలని, యంగ్ హీరో హీరోయిన్స్తో ఓ మంచి ఫ్రెష్ లవ్స్టోరీ చేయాలని అనుకున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అనేది నాకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్.
ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ డైరెక్టర్స్వే. కొత్తవారితో చేసే ఆలోచన లేదా?
– కొత్త దర్శకుల కథలను కూడా విన్నాను. తప్పకుండా వారితో కూడా చేస్తాను. ప్రస్తుతం శేఖర్ కమ్ములగారి ‘ఫిదా’ తర్వాత వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను.
మీ కెరీర్ విషయంలో నాగబాబుగారు ఎలా ఫీల్ అవుతున్నారు?
– నాన్నగారు, నేను ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుతాను. నాన్నగారికి నాపై నమ్మకం ఉంది. నా విషయంలో నాన్నగారు హ్యాపీగా ఉన్నారు. కథ ఎంపికలో నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోరు. నీ జర్నీ నువ్వే చేయాలని అంటారు.
ఈ సినిమాలో వున్న ప్రత్యేకత ఏమిటి?
– సాధారణంగా ప్రేమకథల్లో అబ్బాయి అమ్మాయి వెనుకనో, అమ్మాయి అబ్బాయి వెనుకనో పడతారు..ప్రేమించుకుంటారు. అలా కాకుండా హీరో హీరోయిన్ మాట్లాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ నచ్చడంతో ముకుంద’ సినిమా చేశాను. అందులో హీరో క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. తర్వాత కంచెలో కథనం, బ్యాక్డ్రాప్ బాగా నచ్చాయి. చాలా మంది మంచి కమర్షియల్, మాస్ సినిమా చేయవచ్చు కదా అన్నారు, అదే సమయంలో లోఫర్ సినిమాలోని మదర్ సెంటిమెంట్ నచ్చడంతో ‘లోఫర్’ చేశాను. ఇప్పుడు ‘మిస్టర్’ విషయానికి వస్తే, నా ఏజ్కు తగ్గట్లు ఒక ఎంటర్టైన్మెంట్తో కూడిన లవ్స్టోరీ చేద్దామని అనుకున్నాను. ఆ సమయంలో శ్రీనవైట్లగారు ‘మిస్టర్’ కథ చెప్పడంతో కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో కేవలం ప్రేమే కాదు, మంచి ఎమోషన్స్ కూడా ఉండటంతో సినిమా చేయడానికి అంగీకరించాను.
‘ఫిదా’ ఎంతవరకు వచ్చింది?
– 75 శాతం షూటింగ్ పూర్తయింది. మరో 25 వర్క్ బ్యాలెన్స్ వుంది. శేఖర్ కమ్ములగారి డైరెక్షన్లో సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి క్లాసీ లవ్స్టోరీ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
మళ్ళీ క్రిష్తో సినిమా ఎప్పుడు?
– క్రిష్గారి డైరెక్షన్లో ‘రాయబారి’ చిత్రం చెయ్యాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చెయ్యడం కుదరలేదు. రెగ్యులర్గా మేమిద్దరం టచ్లోనే వుంటాం. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రిలీజ్ తర్వాత క్రిష్ను అభినందించాను. ప్రస్తుతం నాకు రెండు, మూడు కమిట్మెంట్స్ వున్నాయి. అలాగే క్రిష్ కూడా బాలీవుడ్లో సినిమా చేసే ప్లానింగ్లో వున్నారు. ‘రాయబారి’ మంచి స్క్రిప్ట్. తప్పకుండా ఈ సినిమా చేస్తాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో వరుణ్తేజ్.