అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. రెండో సినిమాగా `కల్కి` సినిమాని చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ చిత్రానికి `జాంబీ రెడ్డి` అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జాంబీ రెడ్డి మోషన్ టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. “కరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!“ అంటూ ఈ చిత్రంపై మరింత ఉత్కంఠ పెంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
మోషన్ పోస్టర్లో జాంబీ అనే ఓ స్మశాన వాటికను చూపిస్తూ భయపెట్టిన ఆయన ఆ స్మశానంలోని వాతావరణం, ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వణుకు పుట్టించేలా ఉన్నాయి. థ్రిల్తో పాటు హారర్ జోనర్లో సినిమాని రూపొందించనున్నాడా అనే అనుమానం ప్రేక్షకులలో కలుగుతుంది. యదార్ధ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ ద్వారా ప్రశాంత్ వర్మ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ `జాంబీ రెడ్డి` సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి అనిత్, ఎడిటర్ సాయి బాబు.