‘పందెంకోడి 2’ ట్రైలర్‌ విడుదల

0
279

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో2005లో విడుదలైన చిత్రం ‘పందెంకోడి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పందెంకోడి 2’ రూపొందుతోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. విశాల్‌ నటించిన 25వ చిత్రం ‘పందెంకోడి 2’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణదాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ”ఇండస్ట్రీలోకి వచ్చి `పందెంకోడి 2`తో పాతిక సినిమాలు పూర్త‌య్యాయి. నేను ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం ముందు తల్లిదండ్రులు. మా అన్నయ్య విశాల్‌ కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్‌ను ప్రారంభించాను. ‘పందెంకోడి’తో తమిళంలో సక్సెస్‌ కాగానే తెలుగు రీమేక్‌ కోసం చాలా మంది నిర్మాతలు వచ్చి అడిగినా నాన్నగారు ఒప్పుకోకుండా తెలుగులో రిలీజ్‌ చేసి సక్సెస్‌ను ఇచ్చి నన్ను ఇక్కడ కూడా హీరోగా నిలబెట్టారు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. వారందరికీ థాంక్స్‌. ఈ ప్రయాణంలో ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. ప్రతి సినిమాలో గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేశాను. లింగుస్వామి ‘పందెంకోడి’ సినిమాతో యాక్షన్‌ హీరోని చేశారు. అలాగే నాతో చాలా మంది నిర్మాతలు పనిచేశారు. నిర్మాతలు సినిమాకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెంకోడి 2’ సినిమా విషయానికి వస్తే…13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌. మేకింగ్‌ పరంగా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉండే సినిమా. ఏడురోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో సీక్వెల్‌ ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్‌, జయంతి లాల్‌ గడ, తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. తెలుగు, తమిళంలో సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల చేస్తున్నాం. లింగుస్వామితో ఆ స్వామి(దేవుడు) రెండో సినిమాగా పందెంకోడి చేయించాడు. ఇప్పుడు మళ్లీ 25వ సినిమా చేయించాడు. మహానటి జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో గొప్ప నటనను కనపరిచిన కీర్తి సురేశ్‌ మా సినిమాలో మరో అద్భుతమైన పాత్రను పోషించింది. ఈ సినిమాతో తను యాక్షన్‌ సన్నివేశాలతో కూడా ఆకట్టుకుంటుంది. పందెంకోడి పార్ట్‌ 3 చేస్తే అందులో కూడా కీర్తి సురేశ్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలనిపించింది. తను అంత బాగా నటించింది. ఇక వరలక్ష్మి పాత్ర సినిమా తర్వాత అందరికీ గుర్తుండిపోతుంది. అలాగే రాజ్‌కిరణ్‌గారు హుందా పాత్రలో మళ్లీ చక్కగా నటించారు. అందరూ గుర్తుకు వచ్చిన తర్వాతే ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వచ్చేంత గొప్పగా అందరూ నటించారు. తెలుగులో సినిమాను గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌” అన్నారు.

చిత్ర దర్శకుడు ఎన్‌.లింగుస్వామి మాట్లాడుతూ – ”విశాల్‌లోని ఎనర్జీ లెవల్స్‌ను ‘పందెంకోడి’లో చూపించాను. ఇప్పటికీ అదే ఎనర్జీ లెవల్స్‌ ఉన్నాయి. ఈ సీక్వెల్‌లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. మా కాంబినేషన్‌లో పదమూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా. సినిమా నెక్స్‌ట్‌ లెవల్లో ఉంటుందన నమ్మకంగా చెబుతున్నాను.అసలు ఈ సీక్వెల్‌ చేయడానికి ఇంత సమయం పట్టడానికి కారణం మీరాజాస్మిన్‌లా నటించే హీరోయిన్‌.. లాల్‌లా విలనిజం చూపించే వ్యక్తి దొరకాలని వెయిట్‌ చేశాను. నిజానికి ఐదేళ్ల ముందు కూడా విశాల్‌తో సినిమా చేయాలనుకున్నాను. కానీ స్క్రిప్ట్‌ కుదరలేదు. కీర్తిసురేశ్‌ నటన అందరికీ నచ్చేలా ఉంటుంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. యువన్‌ మ్యూజిక్‌, శక్తి సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్‌ ఎస్సెట్‌గా నిలుస్తాయి. విశాల్‌గారు నిర్మాతగా నాకు ఏం కావాలో దాన్ని సమకూర్చారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న సినిమా విడుదలవుతుంది” అన్నారు.

నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ – ”విశాల్‌గారి అసోషియేషన్‌లో తొలిసారి చేస్తున్న సినిమా. మాపై నమ్మకంతో తెలుగులో సినిమాను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన విశాల్‌గారికి థాంక్స్‌. తెలుగు, తమిళంలో సినిమాను అక్టోబర్‌ 18న భారీగా విడుదల చేస్తున్నాం. పార్ట్‌ వన్‌ కంటే ఈ సీక్వెల్‌ ఇంకా పెద్ద హిట్‌ సాధిస్తుంది. కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌, సూరి సహా యువశన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రాఫర్‌ శక్తి సహా ఎంటైర్‌ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ – ”’మహానటి’ తర్వాత ఆ రేంజ్‌లో తృప్తి ఇచ్చిన సినిమా ఇది. మీరా జాస్మిన్‌గారి పాత్రలో నటించాలని దర్శకుడు లింగుస్వామిగారు అడగ్గానే చేయాలా? వద్దా? అని ఆలోచించుకుంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. విశాల్‌, లింగుస్వామిగారి సహకారంతో చక్కగా పూర్తి చేశాను. వరలక్ష్మిగారు చాలా కీ రోల్‌ చేశారు. ఇందులో చాలా అల్లరి పిల్లలాగా కననపతాను. టీమ్‌ పడ్డ కష్టానికి సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. అక్టోబర్‌ 17న నా పట్టినరోజు.. సినిమా అక్టోబర్‌ 18న విడుదలవుతుంది. అదే పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను” అన్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌ మూవీ. చాలా కీలకమైన పాత్రలో నటించాను. తెలుగు ప్రేక్షకులకు ఇంత మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన లింగుస్వామి, విశాల్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

ఈ కార్యక్రమంలో కె.ఎల్‌.దామోదర్‌, అనీల్‌ సుంకర, ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ దాస్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సుధాకర్‌ రెడ్డి, టి.ఎం.టి సుమన్‌, వీరినాయుడు, ముత్యాల రాందాస్‌ పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here